బెల్లంపల్లి, మార్చి 26 (నేటి తెలుగు పత్రిక): నేత్ర, శరీర, అవయవ దానంపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. గురువారం బెల్లంపల్లిలో ప్రభుత్వ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో కలిసి అవగాహన ర్యాలీని చేపట్టారు. బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి కాంటా చౌరస్తా వరకు చేపట్టిన ఈ అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే వినోద్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. బెల్లంపల్లి ప్రాంతంలో నేత్ర, శరీర, అవయవ దానాల పట్ల అవగాహన కనిపిస్తున్న జనహిత సేవా సమితి సభ్యులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల్లో మరింత చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని, అందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
