ఎ. కొండూరుమార్చి 26 (నేటి తెలుగు పత్రిక): వేసవి ఎండలతీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మండలంలో మూగజీవాలకు నీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపీడీవో బొజ్జగాని శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఎ.కొండూరు మండలంలోని పోలిశెట్టి పాడు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) ద్వారా నిర్మించిన మూగజీవాల నీటి తొట్టెను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో పశువులు, ఇతర మూగజీవాలు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్లను ఎప్పటికప్పుడు నీటితో నింపి ఉంచాలని సూచించారు. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడం కంటే డైరెక్ట్ పంపింగ్ విధానంలో శుద్ధమైన నీటిని తొట్టెలలో నింపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది తరచూ పరిశీలనలు నిర్వహిస్తూ నీటి తొట్టెల వద్ద పరిశుభ్రత పాటించాలని, అవసరమైతే మరిన్ని తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో సూచించారు. మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా మూగజీవాలకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సుందర్లాల్, పోలిశెట్టి పాడు గ్రామ సర్పంచ్ బి. చిట్టిబాబు, పంచాయతీ శాఖ అధికారులు, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.
