మార్చి 28, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలను ఖండిస్తూ జి. కిషన్ రెడ్డి ప్రజలకు కీలక భరోసా ఇచ్చారు. గ్యాస్, పెట్రోల్ నిల్వలు దేశంలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఇతర దేశాల నుంచి రావాల్సిన ఇంధనాన్ని వందశాతం దిగుమతి చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కొన్ని కంపెనీలకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా సాధారణమైందని చెప్పారు.లాక్డౌన్పై వస్తున్న వార్తలను ఖండించిన మంత్రి, అలాంటి పరిస్థితి లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.ప్రపంచంలోని అనేక దేశాలు ఇంధన సుంకాలను పెంచుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజలకు ఊరట కల్పించిందని ఆయన తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించాలని సూచించారు.చివరిగా, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల వద్ద అవసరం లేకుండా క్యూ కట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాధారణంగా సరఫరా కొనసాగుతుందని, ఎలాంటి కొరత ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.
