మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యువతకు కీలక హెచ్చరిక జారీ చేశారు ఐపీఎస్ అధికారి వి. సి. సజ్జనార్. బెట్టింగ్ మాఫియా కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఇందులో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్రికెట్పై ఉన్న ఆసక్తిని దుర్వినియోగం చేసుకుంటూ కొన్ని ముఠాలు ఆన్లైన్ బెట్టింగ్కు యువతను ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్ ప్రకటనల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని మోసగాళ్లు వల వేస్తున్నారని హెచ్చరించారు.మొదట చిన్న మొత్తాలతో నమ్మకం కల్పించి, తరువాత భారీగా డబ్బు పెట్టుబడి పెట్టించి మోసం చేయడం ఈ యాప్ల అసలు విధానమని వివరించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవద్దని యువతకు సూచించారు.అనధికారిక బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా, గదులు అద్దెకు తీసుకుని రహస్యంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలపై పోలీసులు నిఘా పెట్టారని తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్లను ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
