మార్చి 28, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కోల్కతా వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం పై బీజేపీ తరఫున ఛార్జిషీట్ విడుదల చేశారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ టీఎంసీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్లో సాగుతున్నది పరిపాలన కాదని, అది వ్యవస్థీకృత అరాచకమని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో అవినీతి, అక్రమ చొరబాట్లు వ్యవస్థలో భాగమైపోయాయని, ప్రజల్లో భయం పెరిగి విశ్వాసం తగ్గిపోయిందని ఆరోపించారు. “సోనార్ బంగ్లా” పేరుతో సిండికేట్ వ్యవస్థ, ‘కట్ మనీ’ సంస్కృతి ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జాతీయ భద్రత అంశాన్ని ప్రస్తావిస్తూ, బెంగాల్ సరిహద్దులు దేశ భద్రతకు కీలకమని, కానీ టీఎంసీ విధానాలు ఆ భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.విద్య, ఆరోగ్య రంగాల్లో పరిస్థితులు దిగజారిపోయాయని, మహిళలపై నేరాలు, నిరుద్యోగం పెరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు. రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఈ ఛార్జిషీట్ బెంగాల్ ప్రజల అసంతృప్తికి ప్రతిబింబమని బీజేపీ నాయకత్వం తెలిపింది. రాష్ట్రంలో మార్పు కోసం ఇది కీలక సమయమని, అభివృద్ధి దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చింది.
