మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామంగా మారింది.పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5లో మార్పులు చేస్తూ, అమరావతిను ఏకైక శాశ్వత రాజధానిగా చేర్చాలని ఈ తీర్మానంలో కోరారు. అసెంబ్లీ ఆమోదంతో ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేంద్రానికి పంపనుంది. ఇప్పటికే కేంద్రం కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం.ఇక ముందున్న ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ఈ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశముండగా, ఏప్రిల్ 2న పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ ఆమోదం అనంతరం అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయనుంది.అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. అమరావతి కేవలం రాజధాని కాదు, శాతవాహనుల కాలం నుంచి ఉన్న చారిత్రక వారసత్వమని ఆయన గుర్తుచేశారు. ప్రపంచ చరిత్రలో అరుదైన విధంగా వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
అలాగే, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిందని ఆరోపించారు. భవిష్యత్తులో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.మొత్తంగా, అమరావతి రాజధాని అంశంలో ఈ తీర్మానం కీలక మలుపుగా మారగా, రాబోయే రోజుల్లో కేంద్ర నిర్ణయాలపై రాష్ట్ర భవిష్యత్ రాజకీయ దిశ ఆధారపడనుంది.
