అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందనున్న నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరపాలని ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు తదితరులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన కీలక సూచనలు చేశారు. బిల్లు ఆమోదం పూర్తయిన వెంటనే ప్రతి నియోజకవర్గంలో పండగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు.ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఇంట్లో, పార్టీ కార్యాలయాల్లో దీపాలు వెలిగించాలని సూచించారు. ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.అమరావతి కోసం జరిగిన పోరాటంలో రైతులు, మహిళలకు జనసేన పార్టీ అందించిన మద్దతు, అలాగే పవన్ కళ్యాణ్ చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్కు ఒకే రాజధాని అమరావతే అన్న పార్టీ వైఖరిని మరింత బలంగా ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.
