అమ్మకాల లెక్క ఘనంగా ఉన్నా ఆదాయం పెరుగుదల స్వల్పమే
ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బీర్, ఐఎంఎల్ విక్రయాలు భారీగా పెరగడంతో మొత్తం అమ్మకాల విలువ 6.11 శాతం పెరిగింది. అయితే ధరల మార్పులు, ఇతర ఆదాయ వనరుల తగ్గుదల కారణంగా మొత్తం రెవెన్యూ పెరుగుదల మాత్రం కేవలం 0.68 శాతం మాత్రమే నమోదు అయ్యింది. ముగిసిన ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు గణాంకాలను పరిశీలిస్తే, భారతీయ తయారీ మద్యం (ఐఎంఎల్) కేసులు 362 లక్షల నుంచి 414 లక్షలకు పెరిగి 14.59 శాతం వృద్ధిని నమోదు చేశాయి. బీర్ విక్రయాలు 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగి 70.29 శాతం భారీ వృద్ధి సాధించాయి.
మొత్తం సేల్స్ విలువ రూ.29,440 కోట్ల నుంచి రూ.31,237 కోట్లకు పెరిగి 6.11 శాతం వృద్ధి నమోదైంది. సేల్స్ ద్వారా వచ్చే రెవెన్యూ రూ.24,734 కోట్ల నుంచి రూ.25,727 కోట్లకు పెరిగి 4.01 శాతం వృద్ధి సాధించింది. అయితే “ఎల్ఎఫ్, ఇతరాలు” విభాగంలో ఆదాయం రూ.4,112 కోట్ల నుంచి రూ.3,316 కోట్లకు తగ్గి 19.37 శాతం పడిపోయింది. దీని ప్రభావంతో మొత్తం రూ.28,846 కోట్ల నుంచి రూ.29,042 కోట్లకు మాత్రమే పెరిగి 0.68 శాతం స్వల్ప వృద్ధి నమోదైంది.
అధికారిక గణాంకాల ప్రకారం, తక్కువ ధరల మద్యం అమ్మకాలు పెరగడం వల్ల ఆదాయం అనుకున్నంతగా పెరగలేదు. విక్రయాలలో రూ.99 ధర ఉన్న 180 మిల్లీ లీటర్ బాటిళ్ల వాటా పెరగడం వల్ల సుమారు రూ.442 కోట్ల వరకు నష్టం జరిగింది. అలాగే ప్రముఖ బ్రాండ్ల ధరలు తగ్గించడంతో రూ.972 కోట్ల వరకు ఆదాయం తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే 180 మిల్లీ లీటర్ బాటిల్ సగటు ధర రూ.180 నుంచి రూ.160కి తగ్గింది. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన సుమారు రూ.1,900 కోట్ల నాన్-రీఫండబుల్ ఫీజులు ఈసారి లేకపోవడం కూడా మొత్తం ఆదాయంపై ప్రభావం చూపింది. అయినా, మద్యం అమ్మకాలతో వినియోగం పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
