అమరావతి, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత లభించడం రాష్ట్ర ఆత్మగౌరవానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.ఈ చారిత్రక సందర్భంగా ఉద్దండరాయునిపాలెం గ్రామాన్ని సతీసమేతంగా సందర్శించిన ఆయన, రాజధాని శంకుస్థాపన స్థలంలో దీపహారతి ఇచ్చి పుణ్యభూమికి సాష్టాంగ ప్రణామం చేశారు.ఈ సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న రైతులను కలిసిన చంద్రబాబు, వారి త్యాగం, పోరాటాలను గుర్తుచేసుకున్నారు. 1,631 రోజుల పాటు రైతులు, మహిళలు చేసిన వీరోచిత పోరాటం తనను భావోద్వేగానికి గురిచేసిందన్నారు.అమరావతి కోసం రైతులు చేసిన త్యాగానికి ఎలాంటి ప్రతిఫలం ఇచ్చినా తక్కువేనని, వారి రుణం ఎప్పటికీ తీర్చలేమని పేర్కొన్నారు.అలాగే అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని అభివృద్ధికి మరింత కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.











