ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతూ ఆయన, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీష్ బాబు వంటి నాయకులు రాజకీయంగా వెనుకబడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని చెప్పిన ఆయన, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు. అలాగే గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన కొనసాగిస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు.


