ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ముఖ్యంగా పాడేరు, అరకు వ్యాలీ, హుకుంపేట, పెదబయలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది.గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు రాత్రంతా రోడ్లపైనే గడిపారు. ప్రకంపనల కారణంగా ఇళ్లలోని కొన్ని వస్తువులు కింద పడిపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.కోరాపుట్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో, భూమి లోపల సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.అయితే ఎక్కడా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. కొండ ప్రాంతం కావడంతో కొండచరియలు విరిగిపడతాయేమో అన్న భయంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు.భూకంప సమయంలో ఇళ్లలో ఉండటంకంటే ఖాళీ ప్రదేశాల్లోకి వెళ్లడం సురక్షితమని అధికారులు సూచించారు.
