ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: గచ్చీబౌలి స్టేడియంలో జరిగిన 74వ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ చాంపియన్షిప్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలోని యువత క్రీడా మైదానాలను వదిలి దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత సరైన దిశలో నడవకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణను క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గతంలో ఫుట్బాల్ రంగంలో హైదరాబాద్కు ఉన్న గొప్ప పేరు ప్రఖ్యాతులను గుర్తుచేసుకుంటూ, మళ్లీ ఆ స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు.గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచ స్థాయి క్రీడా వేదికగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి క్రీడలకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.అంతేకాకుండా సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు యువతను క్రీడల వైపు మళ్లించాలని సీఎం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపి, విజేతలకు ట్రోఫీలు అందజేశారు.
