ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్) ద్వారా తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ ఆస్పత్రులను రాష్ట్ర ప్రజలతో పాటు విదేశీ రోగులకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఏ. రేవంత్ రెడ్డి సర్కార్ జూన్ 2న సనత్నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి ఆస్పత్రిలో విదేశీ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా బెడ్స్ కేటాయించనున్నారు.ఇంటర్నేషనల్ పేషెంట్ల కోసం ప్రత్యేక వింగ్లు ఏర్పాటు చేసి, విదేశీ ప్రభుత్వాలతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా, అరబ్ దేశాల నుంచి వచ్చే రోగులను ఆకర్షించడంపై దృష్టి పెట్టారు.హృదయ శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, క్యాన్సర్ వంటి క్లిష్ట వైద్య సేవలను అంతర్జాతీయ ప్రమాణాలతో తక్కువ ఖర్చులో అందించనున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గనుంది.సుమారు రూ.1100 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రుల్లో 1000 పడకలు, ఆధునిక సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందం అందుబాటులో ఉండనుంది. తెలంగాణను మెడికల్ హబ్గా తీర్చిదిద్దడంలో టిమ్స్ కీలక పాత్ర పోషించనుంది.
