ఆదిలాబాద్, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, ఆ తర్వాత అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పిప్రిలో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమకు కేవలం రాజకీయ ప్రత్యర్థులేనని, శత్రువులు కాదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రస్తావించే సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.అంతకుముందు రూ.225 కోట్ల వ్యయంతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో విద్య, వైద్య రంగాల్లో ఇంకా అభివృద్ధి అవసరముందని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే వెనుకబాటుతనానికి కారణమని విమర్శించారు.
