ఆదిలాబాద్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: నియోజకవర్గాల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పిప్రి గ్రామంలో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రతిపక్షం, అధికార పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో కూడా ఎక్కడా రాజకీయాలు చూడలేదని, ప్రజల అవసరాలనే ప్రాధాన్యంగా తీసుకున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాను 2034 నాటికి పారిశ్రామిక, పర్యాటక, విద్యా హబ్గా తీర్చిదిద్దుతామని లక్ష్యాన్ని వెల్లడించారు. ఇప్పటికే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునఃప్రారంభం, ఎయిర్పోర్టు, యూనివర్సిటీ, భారీ ఇండస్ట్రియల్ పార్క్ వంటి ప్రాజెక్టులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.బాసర సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు కేటాయించినట్లు వెల్లడిస్తూ, జిల్లాలో మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.“మేం పాలకులు కాదు.. ప్రజలకు సేవకులం” అంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం కావాలని సీఎం కోరారు.






