ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో అమరావతి రాజధాని అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రత్యేక జలహారతి కార్యక్రమం నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో దుర్గా ఘాట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ కుమారుడు కేశినేని వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేశినేని వెంకట్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సమర్థ నాయకత్వంతోనే సాధ్యమని, ముఖ్యంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే సామర్థ్యం సీఎం చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. రాజధానికి చట్టబద్ధత లభించడం రాష్ట్ర ప్రజలందరికీ ఆనందదాయకమని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కృష్ణానదికి జలహారతి ఇవ్వడంతో పాటు, అమరావతి నిర్మాణం నిరంతరాయంగా కొనసాగాలని ప్రార్థనలు చేశారు. రాజధాని బిల్లుకు మద్దతు తెలిపిన కేంద్రం, రాష్ట్ర నాయకులకు సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.అమరావతి అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు విజయవాడను గ్రేటర్ సిటీగా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.




