ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల ఫీజు వసూళ్లపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులు నాలుగున్నర సంవత్సరాల కోర్సు వ్యవధికే పరిమితం చేయాలని స్పష్టం చేసింది.కోర్సు వ్యవధి 4.5 సంవత్సరాలే అయినప్పటికీ, ఫీజులను ఐదు విడతలుగా వసూలు చేయవచ్చని తెలిపింది. అయితే ఐదు సంవత్సరాల ఫీజుల పేరుతో అదనపు మొత్తాలు వసూలు చేయడం కఠినంగా నిషేధించింది. ఫెయిల్ అయిన లేదా డిటైన్ అయిన విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయరాదని, ముందుగానే మొత్తం ఫీజులు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అనుబంధాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించడమే ఈ నిర్ణయం లక్ష్యమని యూనివర్సిటీ పేర్కొంది.
