కరీంనగర్, ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: జిల్లా యువజన అధికారిగా వెంకట రాంబాబు విశేష సేవలు అందించారని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నెహ్రూ యువజన కేంద్రంలో కరీంనగర్ జిల్లా యూత్ ఆఫీసర్ వెంకట రాంబాబు బదిలీ ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ కొలగాని శ్రీనివాస్ హాజరయ్యారు. బదిలీ పై వెళ్తున్న యువజన అధికారికి మేయర్ కొలగాని శ్రీనివాస్ శాలువాతో సత్కరించి వీడ్కోలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా యువజన సేవలో వెంకట రాంబాబు చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. వెంకట రాంబాబు కు మాకు చాలా కాలంగా అనుబంధం ఉందని తెలిపారు.వెంకట రాంబాబు తన హయాంలో యువతను చైతన్యపరచడంలో, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. యువజన సంఘాల బలోపేతం కోసం కృషి చేశారని అన్నారు. జిల్లాలోని నెహ్రూ యువ కేంద్రం ద్వారా వేలాది మంది యువతకు నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించడమే కాకుండా…సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంలో ఆయన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.వెంకట రాంబాబు మాట్లాడుతూ….తన పదవీ కాలంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి, యువజన సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ ప్రజలు చూపిన ఆదరాభిమానాలు తన జీవితంలో మర్చిపోలేనివని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు యవజన సంఘ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
