ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మాజీ మంత్రి టి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొంగులేటి వ్యాఖ్యలు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేతలా ఉన్నాయని విమర్శించారు.రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన అక్రమాలపై సభలోనే పరోక్షంగా అంగీకారం తెలిపారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు శాఖలు విచారణ జరిపి నివేదికలు ఇచ్చాయని తెలిపారు. నోటీసులు అందినప్పటికీ సంబంధం లేదని చెప్పడం తప్పుదోవ పట్టించడమేనన్నారు. శిల్ప, AQ సంస్థల్లో పొంగులేటి కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నాయా అని హరీష్రావు ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను కబ్జా చేస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.భూముల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేయడం వెనుక కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 2016లో నాదర్గుల్ భూములపై విధించిన నిషేధాన్ని గుర్తు చేస్తూ ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరారు.పొంగులేటి తన ధోరణి మార్చుకోవాలని సూచిస్తూ, ఇంకా అక్రమాలపై ఆధారాలతో బయటపెడతామని హరీష్రావు హెచ్చరించారు.
