ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన అంశం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఉన్న 14 అసెంబ్లీ స్థానాలు భవిష్యత్తులో 21కు పెరిగే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాగా ఉన్న ఈ ప్రాంతంలో సీట్ల పెంపు జరిగితే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. గతంలో జరిగిన పునర్విభజనలో కొన్ని నియోజకవర్గాలు రద్దు కాగా, కొత్తగా కొన్ని ఏర్పడ్డాయి. ఇప్పుడు మరోసారి పెద్ద ఎత్తున మార్పులు జరగనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.ప్రత్యేకంగా తిరుపతి ప్రాంతంలో జనాభా ఆధారంగా కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. తిరుపతి రూరల్, రేణిగుంట, నాయుడుపేట వంటి ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని కొత్త సీట్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో రద్దయిన పుత్తూరు నియోజకవర్గం మళ్లీ పునరుద్ధరించే అంశం కూడా పరిశీలనలో ఉంది.ఇక పశ్చిమ భాగంలో బంగారుపాళ్యం, కలికిరి కేంద్రంగా కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో స్థానిక నాయకుల్లో ఆశలు పెరుగుతున్నాయి.అసెంబ్లీ సీట్లతో పాటు ఒక కొత్త పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఏర్పడే అవకాశముందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ స్థానాలు రిజర్వ్గా ఉండటంతో కొత్త స్థానం జనరల్ కేటగిరీలో ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.ఈ మార్పులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయంగా మరింత ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. సీట్ల పెంపు ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది? కొత్త రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
