ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో గతంలో ఏర్పడిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం ద్వారా ప్రతి నెల 9వ తేదీన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ, రెవెన్యూ వ్యవస్థలో చేపట్టిన మార్పులను ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు.బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆనందం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 21.23 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల పాస్ పుస్తకాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.ఆటో మ్యూటేషన్ అనంతరం పాస్ పుస్తకాలను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు పంపే విధానం అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. రైతుల భూ సమస్యలను పూర్తిగా పరిష్కరించి వారికి భద్రత, నమ్మకం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.







