ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని బ్యారేజీల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులను వేగవంతం చేయాలని చెప్పారు.ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే నీటిపారుదల శాఖ, నిపుణులు, నిర్మాణ సంస్థలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని తెలిపారు.మేడిగడ్డ వద్ద కుంగిపోయిన భాగంతో పాటు మొత్తం బ్యారేజిని సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. భూగర్భ పరిస్థితుల అధ్యయనం కోసం 500 బోరు బావులు తవ్వేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.మరమ్మతులకు సంబంధించిన డిజైన్లు త్వరగా సిద్ధం చేసి, డిసెంబరు వరకు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించాలని చెప్పారు. పనుల్లో జాప్యం లేకుండా నిధులు అందిస్తామని, అవసరమైతే తానే వచ్చి పరిశీలిస్తానని సీఎం వెల్లడించారు.


