ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న మోసాలను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చర్యలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా UPI, IMPS ద్వారా జరిగే పెద్ద మొత్తాల లావాదేవీలపై నియంత్రణలు తీసుకురావాలని భావిస్తోంది.ఈ మేరకు రూ.10,000కు పైబడిన ట్రాన్సాక్షన్లకు “కూలింగ్-ఆఫ్ పీరియడ్” అమలు చేయాలని ప్రతిపాదించింది. అంటే వినియోగదారు ఈ మొత్తానికి మించి డబ్బు పంపినప్పుడు, అది వెంటనే గ్రహీత ఖాతాలో జమ కాకుండా కొంత సమయం (సుమారు ఒక గంట) ఆలస్యంగా చేరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పంపిన వ్యక్తి లావాదేవీని పరిశీలించి, అవసరమైతే రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.సోషల్ ఇంజనీరింగ్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని ఆర్బీఐ భావిస్తోంది. మోసగాళ్లు వినియోగదారులను మోసం చేసి వెంటనే డబ్బు పంపేలా ఒత్తిడి తెస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమయం ఇవ్వడం ద్వారా మోసాలను తగ్గించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.అయితే విశ్వసనీయ వ్యక్తులను ముందుగానే వైట్లిస్ట్లో చేర్చుకుంటే, వారికి డబ్బు పంపేటప్పుడు ఎలాంటి ఆలస్యం ఉండదు. అలాగే వ్యాపార చెల్లింపులు, ఇ-మాండేట్లు, చెక్కులు, NACH లావాదేవీలకు ఈ నియమాలు వర్తించవు.ఇంకా వృద్ధులకు భద్రత కల్పించేందుకు 70 ఏళ్లు పైబడిన వారు పెద్ద మొత్తాల బదిలీ చేయాలంటే అదనపు అనుమతి అవసరం చేయాలని ప్రతిపాదించారు. అలాగే పెద్ద మొత్తాల డిపాజిట్లకు అదనపు ధృవీకరణ విధానం తీసుకురానున్నారు.ఈ ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత తుది మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.
