ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పవిత్ర క్షేత్రాల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని, ముఖ్యంగా తాగునీటి సమస్య ఎప్పటికీ లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ ద్వారా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంతర్వేదిలో రూ.17.33 కోట్ల వ్యయంతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అంతర్వేది దేవస్థానం పరిధితో పాటు పలు గ్రామాలకు చెందిన సుమారు 30 వేల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందనుంది.ప్రాజెక్టులో భాగంగా నీటి శుద్ధి కోసం ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గన్నవరం కాలువ నుంచి నీటిని పంపింగ్ చేసి నిల్వ చేసి సరఫరా చేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. గతంలో దూర ప్రాంతాల నుంచి నీరు సరఫరా చేయడంలో ఎదురైన ఇబ్బందులు ఇక తొలగిపోతాయని చెప్పారు.అలాగే ఓఎన్జీసీ నిధులతో రూ.5 కోట్ల వ్యయంతో 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ఫిల్టర్ వ్యవస్థ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 29 గ్రామాలకు చెందిన లక్షా 20 వేల మందికి తాగునీటి సరఫరా మెరుగుపడనుంది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని అధికారులు తెలిపారు.
