ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీట్ఎక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి హామీల వర్షం కురిపించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేస్తూ కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా మహిళల కోసం ప్రతి నెల రూ.3,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, ఉచిత బస్సు ప్రయాణం, మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు వంటి హామీలు ఇచ్చారు. మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేస్తామని స్పష్టం చేసింది. చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటూ ‘డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్’ విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. గోవధను అరికట్టడంపై కూడా దృష్టి సారిస్తామని చెప్పారు.ఉద్యోగుల కోసం 45 రోజుల్లోనే 7వ పే కమిషన్ అమలు చేసి పెండింగ్ డీఏ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి అందిస్తామని తెలిపారు. ఉత్తర బెంగాల్లో ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ఈ సందర్భంగా టీఎంసీ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దారి నుంచి దూరం చేశారని ఆరోపించారు. భయరహిత బెంగాల్ నిర్మాణమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
