ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలను మహిళా సంఘాల నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీతో మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వివరించారు.మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఇటుక తయారీ యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇవి దోహదపడుతున్నాయని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న ఇటుక యూనిట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పీఎంఈజీపీ పథకం ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తూ మహిళలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని తెలిపారు.మహిళా సంఘాల యూనిట్లు ఉపాధి కల్పనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతున్నాయని మంత్రి సీతక్క వెల్లడించారు.
