ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.నేతలు, కార్యకర్తల నుంచి ప్రత్యక్షంగా ఫీడ్బ్యాక్ తీసుకున్న సీఎం, ప్రజలకు చేరుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. గ్రామస్థాయి వరకు ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థంగా చేరేలా పార్టీ యంత్రాంగం మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.పార్టీ బలోపేతం కోసం శిక్షణా కార్యక్రమాలు కీలకమని సీఎం పేర్కొన్నారు. కార్యకర్తలు ప్రజల మధ్య ఉండి సమస్యలను గుర్తించి, వాటిని వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు.అదేవిధంగా పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి ప్రత్యేకంగా “E3” కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలు ఆర్థికంగా స్థిరపడితేనే పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పని చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం పిలుపునిచ్చారు. శిక్షణా తరగతులు పార్టీ భవిష్యత్ వ్యూహాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.
