ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలనను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు మరియు పరిపాలనలో ఆధునిక విధానాలను అమలు చేయడానికి మంత్రులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది మంత్రులను విదేశీ అధ్యయన పర్యటనకు పంపనున్నారు. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న ఉత్తమ పరిపాలనా విధానాలను అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో అమలు చేయడం.ఈ బృందం ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్లో పర్యటించనుంది. అక్కడి నగరాభివృద్ధి నమూనాలు, ఆర్థిక ప్రణాళికలు, ప్రజా సేవల నిర్వహణ విధానాలపై నిపుణుల నుంచి ప్రత్యక్షంగా శిక్షణ పొందనున్నారు. పర్యటనలో పాల్గొనే మంత్రుల్లో నారాయణ, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. వీరితో పాటు సీనియర్ అధికారులు కూడా ఈ బృందంలో భాగమవుతున్నారు. పారదర్శక పాలన, వేగవంతమైన సేవలు, సమర్థవంతమైన పరిపాలనపై ప్రత్యేక దృష్టి సారించనున్న ఈ శిక్షణ ద్వారా మంత్రులు తమ శాఖల్లో కొత్త ఆలోచనలు అమలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రులు మరియు అధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
