ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆదివాసీ, గిరిజన మరియు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.మంత్రి ధనసరి అనసూయ సీతక్క నాయకత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేల బృందం జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో సమావేశమై ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ తాగునీరు మరియు సాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.రహదారులు మరియు చెక్ డ్యాంల నిర్మాణానికి అటవీ శాఖ నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటామని, అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజన రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయడానికి అనుమతుల విషయంపై కూడా సానుకూలంగా స్పందించారు.ఎమ్మెల్యేలు అటవీ శాఖ అనుమతుల కారణంగా రహదారుల మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయని, కొత్త రహదారుల నిర్మాణానికి అనుమతులు రావడం లేదని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమస్యలపై త్వరిత నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే, గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటాను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని, ఐటీడీఏలను బలోపేతం చేసి గిరిజనులకు మరింత మద్దతు అందిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు.
