ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: దేశంలో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు, పునర్విభజన ప్రక్రియను జీఎస్డీపీ (GSDP) ఆధారిత హైబ్రీడ్ మోడల్లో నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు పూర్తి మద్దతు ఉన్నప్పటికీ, సీట్ల పెంపు విషయంలో కేంద్రం తీసుకుంటున్న విధానం ఉత్తర–దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచుతుందని ఆయన హెచ్చరించారు.ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 50 శాతం పెంచితే వచ్చే 272 కొత్త సీట్లలో సగం (136) ప్రొరేటా పద్ధతిలో, మిగతా సగం జాతీయ స్థూల ఉత్పత్తి (GSDP) ప్రాతిపదికన కేటాయించాలని సీఎం ప్రతిపాదించారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఎక్కువగా తోడ్పడుతున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని స్పష్టం చేసిన సీఎం, నియోజకవర్గాల పెంపు, పునర్విభజన అంశాలను దీనితో కలపడం సరైంది కాదన్నారు. ఈ రెండు వేర్వేరు అంశాలని, వాటిపై విడిగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.
కేంద్రం ప్రాతిపదిక లేకుండా సీట్లను 50 శాతం పెంచితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని సీఎం అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోవడం వల్ల రాజకీయ అసమానతలు పెరిగే ప్రమాదం ఉందన్నారు.ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించాలని, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సంబంధం ఉన్న కీలక అంశాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు.జనాభా లెక్కలు పూర్తయ్యాకే పునర్విభజనపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం అభిప్రాయపడ్డారు. 2028 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటివరకు విస్తృత చర్చ అవసరమని పేర్కొన్నారు.మహిళా రిజర్వేషన్లను ముందుగా అమలు చేసి, తర్వాత నియోజకవర్గాల పెంపుపై చర్చించాలని సీఎం సూచించారు. దేశ సమతౌల్యం, సమగ్ర అభివృద్ధి కోసం హైబ్రీడ్ మోడల్పై చర్చ జరిపి ఏకాభిప్రాయం సాధించాలని పిలుపునిచ్చారు.




