ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్బండ్ వద్ద జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశానికి మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇద్దరూ సమానంగా ముఖ్యమని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ పాత్ర ఎంత ఉందో, దేశ నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర అంతే కీలకమని పేర్కొన్నారు.గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన సీఎం, దళితులకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. “దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను ఎవరూ మర్చిపోలేరని ఆయన అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రానికి భారీ అప్పులు మిగిలాయని, ఇప్పుడు వాటిని తీర్చుకుంటూ పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు.అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, వాటిలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే లభించాయని సీఎం వివరించారు. ప్రభుత్వ పాలనలో సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని తెలిపారు.మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు విషయంలో కేంద్రం గందరగోళం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. ఈ అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.జీఎస్డీపీ ఆధారంగా హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేపట్టాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
