ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల 21 మంది విద్యార్థుల బృందం నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రకు లోకేష్ ఉండవల్లి నివాసంలో ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేష్ ప్రత్యేకంగా మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు. కసి, పట్టుదల ఉంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని ప్రపంచాన్ని జయించాలని విద్యార్థులకు సూచించారు.ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. వారి ప్రతిభను వెలికితీసేందుకు అవసరమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థుల ధైర్యసాహసాలను అభినందించిన లోకేష్, ఎవరెస్ట్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి తిరిగి రావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర ద్వారా ఇతర విద్యార్థులకు కూడా ప్రేరణ కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
