ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హౌస్ లిస్టింగ్ కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు జారీ చేసింది.సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారాలు జనగణనపై ప్రభావం చూపకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి, ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించింది.జనగణనకు సంబంధించిన ఏదైనా తప్పుదారి పట్టించే సమాచారం బయటపడితే వెంటనే స్పందించాలని అధికారులకు స్పష్టం చేసింది. ఆ సమాచారం నిజానిజాలు తెలుసుకుని ప్రజలకు సరైన వివరాలు అందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.ఫ్యాక్ట్ చెక్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా చూడాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో కమ్యూనికేషన్ నైపుణ్యం కలిగిన నిపుణులను కూడా నిఘా బృందాల్లో చేర్చాలని తెలిపింది.రాష్ట్రాల సెన్సస్ డైరెక్టరేట్లు తమ ఫీల్డ్ సిబ్బంది ద్వారా సమాచారాన్ని సేకరించి, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను పరిశీలిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.సాంకేతికతను వినియోగిస్తూ పారదర్శకంగా జనగణన నిర్వహించాలనే లక్ష్యంతో కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ప్రజల సహకారం, అవగాహనతో ఈ భారీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
