ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారి తీసిన సంఘటనగా పూడి శ్రీహరి అరెస్ట్ మారింది. వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పొలిటికల్)గా, మాజీ ముఖ్యమంత్రి కార్యాలయ సీపీఆర్ఓగా పనిచేసిన శ్రీహరిని పోలీసులు మఫ్టీలో వచ్చి అదుపులోకి తీసుకెళ్లడంపై పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.పార్టీ వర్గాల ప్రకారం, ఉదయం నాయకుడిని కలుసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో శ్రీహరిని మధ్యలో అడ్డగించి, ఏ స్టేషన్కు చెందినవారో, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించారు. అంతేకాకుండా ఆయన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.ఈ ఘటన తర్వాత కొద్ది సేపటికే పోలీసులు శ్రీహరి ఇంటిపై కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, కుటుంబ సభ్యులు, సిబ్బందిని బెదిరించి బయటకు పంపించి పూర్తిగా తనిఖీలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో ఎవరికీ లోపలికి అనుమతి ఇవ్వలేదని, పార్టీ ప్రజాప్రతినిధులను కూడా అడ్డుకున్నారని వైసీపీ నేతలు పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించింది. అక్రమ కేసులు, అరెస్టులు పెరుగుతున్నాయని, ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు అయిన శ్రీహరిని టార్గెట్ చేయడం మరింత ఆందోళనకరమని పేర్కొంది.ఈ చర్య పూర్తిగా చట్టవిరుద్ధమని, పోలీసులు విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. వెంటనే పూడి శ్రీహరిని బేషరతుగా విడుదల చేయాలని పార్టీ డిమాండ్ చేసింది.ఈ ఘటనపై ఇంకా అధికారికంగా పోలీసుల నుంచి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
