ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా అవివేకమని, రాష్ట్ర చరిత్రను అవమానించే ప్రయత్నమని ఆయన మండిపడ్డారు.తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి వెంటనే తొలగించాలని, అవసరమైతే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావంపై సరైన అవగాహన లేకుండా మాట్లాడడం తగదని అన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఈ అంశంపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించిన పొన్నం, పార్టీ నాయకత్వం తేజస్వికి సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమం పట్ల గౌరవం ఉండాలని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని తెలిపారు. తెలంగాణపై ఎవరైనా నిర్లక్ష్యంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించిన మంత్రి, ఈ వ్యాఖ్యలను సమర్థించే వారిని కూడా తప్పుబట్టారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
