ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే ఆయనను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని దాసోజు పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్ ఆమోదంతో ఏర్పడిన రాష్ట్రాన్ని, మత ప్రాతిపదికన జరిగిన విభజనతో పోల్చడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి దశాబ్దాల పోరాటం, విద్యార్థుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలు కారణమని గుర్తుచేసిన దాసోజు,అలాంటి ఉద్యమాన్ని అవమానించడం తెలంగాణ అమరవీరుల పట్ల అవమానకరమని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు.అలాగే తెలంగాణకు చెందిన ఎంపీలు ఈ అంశంపై మౌనం వహించడం సరికాదని, ప్రజల తరఫున స్పందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని తెలిపారు.తేజస్వీ సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని దాసోజు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.ఈ ఘటనతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. వివిధ పార్టీల నేతలు వరుసగా స్పందిస్తూ ఈ అంశాన్ని పెద్ద రాజకీయ చర్చగా మారుస్తున్నారు.
