ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా శుక్రవారం లోక్సభ మారింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ సహా మూడు ముఖ్యమైన బిల్లులపై ఇవాళ సాయంత్రం ఓటింగ్ జరగనుండడంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లులపై చర్చ రెండో రోజుకు చేరుకోగా, తుది నిర్ణయం సాయంత్రం 4 గంటలకు వెలువడనుంది.మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రత్యేక మెజారిటీ అవసరం ఉంది. లోక్సభలో మొత్తం సభ్యుల మెజారిటీతో పాటు, హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం రెండు మూడొంతుల మద్దతు లభించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికార కూటమికి పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది.డీలిమిటేషన్ అంశంపై విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, ఈ అంశమే బిల్లుల ఆమోదంలో ప్రధాన అడ్డంకిగా మారింది. కాంగ్రెస్ సహా పలు పార్టీలూ తమ సభ్యులకు విప్ జారీ చేసి ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించాయి.అయితే కొందరు సభ్యులు గైర్హాజరు అయితే ఓటింగ్ ఫలితంపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్షాలు తమ సభ్యుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాయి. మరోవైపు ఈ బిల్లులకు విస్తృత మద్దతు ఇవ్వాలని కేంద్రం అన్ని పార్టీలను కోరుతోంది.బిల్లులు ఆమోదం పొందితే మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరగడానికి ఇది కీలక అడుగుగా నిలవనుంది. అయితే అమలు మాత్రం డీలిమిటేషన్ పూర్తయ్యాకే సాధ్యమవుతుంది. దీంతో తుది ఫలితంపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
