ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా మరో కీలక అడుగు పడింది. శాస్త్రిపురం వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైందీ, దీన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.సికింద్రాబాద్–ఫలక్నుమా–శివరాంపల్లి రైల్వే మార్గంలోని లెవల్ క్రాసింగ్ వద్ద ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. సుమారు రూ.71 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన 490 మీటర్ల పొడవు, రెండు వైపులా రెండేసి లేన్లతో వాహన రాకపోకలకు అనుకూలంగా రూపొందించారు.ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మైలార్దేవ్పల్లి నుంచి ఫలక్నుమా వరకు ప్రయాణం సులభతరం కానుంది. ఇప్పటివరకు రైల్వే గేటు వద్ద ఎదురయ్యే ఆలస్యాలు పూర్తిగా తొలగిపోనున్నాయి.దీంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గనుంది. వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణం కలగడంతో పాటు కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. ఈ ఫ్లైఓవర్ పాతబస్తీ ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చనుంది.
