ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపే పీఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని కల్వకుంట్ల కవిత విమర్శించారు. 28 నెలలు గడిచినా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని అన్నారు.కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామన్న హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆమె ఆరోపించారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలు మాటలకే పరిమితమైందని, రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ కూడా సకాలంలో అందడం లేదని తెలిపారు.అలాగే పెండింగ్లో ఉన్న ఐదు డీఏలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తి పెంచుతోందని కవిత అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చేపట్టిన నిరసనలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కవిత ప్రకటించారు.
