ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ నేత హరీష్రావు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని విమర్శిస్తూ.. కనీసం ఒకసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఆయన ఆరోపించారు. రైతులు పంటలు అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పంట బీమా అమలు కావడం లేదని, సన్న బియ్యానికి ప్రకటించిన బోనస్ రైతులకు అందడం లేదని ఆయన అన్నారు.అదేవిధంగా రైతు భరోసా పథకం కూడా అందరికీ చేరడం లేదని పేర్కొంటూ, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రైతుల సమస్యలపై తక్షణమే స్పందించకపోతే బీఆర్ఎస్ భారీ స్థాయిలో ఉద్యమానికి దిగుతుందని హరీష్రావు హెచ్చరించారు.రైతుల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
