ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు ఖరీదైన చికిత్స అందించిన ఘటనతో ప్రేరణ పొందిన మంత్రి నారా లోకేష్, అరుదైన వ్యాధుల బాధితులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రాజెక్ట్ పునర్విక’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా జన్యు సంబంధిత అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు సమగ్ర సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ముఖ్యంగా కోట్ల రూపాయలు ఖర్చయ్యే చికిత్సలను సాధ్యమైనంత వరకు అందుబాటులోకి తీసుకురావడం, ఖర్చులను తగ్గించే మార్గాలపై దృష్టి పెట్టనున్నారు.అదేవిధంగా, ఆధునిక వైద్యసేవలను అందరికీ చేరువ చేయడం, విదేశీ చికిత్సలపై ఆధారపడకుండా దేశంలోనే సౌకర్యాలు మెరుగుపరచడం కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అరుదైన వ్యాధులపై అవగాహన పెంచడం, బాధిత కుటుంబాలకు మార్గదర్శకత్వం అందించడం వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు.పునర్వికకు అందించిన సహాయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. అదే స్ఫూర్తితో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అనేక మందికి ఆశాకిరణంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
