ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వేములవాడ నియోజకవర్గం అగ్రహారం గ్రామానికి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పిస్తూ, స్వయంగా పాడె మోసి ప్రత్యేక గౌరవాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. “జై తెలంగాణ” నినాదాన్ని జీవిత సారంగా భావించి, ప్రతి రోజు ఉద్యమంలో పాల్గొన్న ధైర్యవంతురాలు అని కొనియాడారు.స్వరాష్ట్ర సాధన కోసం ఆమె చేసిన త్యాగం, అంకితభావం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ముఖ్యంగా యువత సత్తెమ్మలాంటి ఉద్యమకారుల నుంచి ప్రేరణ పొందాలని సూచించారు.సత్తెమ్మ మృతితో తెలంగాణ ఉద్యమానికి అపూర్వ లోటు ఏర్పడిందని కేటీఆర్ పేర్కొంటూ.. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
