Breaking News

బీసీ రాజ్యాధికారం సాధ్యం అవుతుంది: ఈటల రాజేందర్

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీసీ జనజాతర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. “మన ఆలోచన సాధన సమితి” ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ సభకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావులు ఒకే వేదికపైకి వచ్చినట్లు, ఇప్పుడు బీసీ జనజాతర కూడా అదే ఐక్యతను ప్రతిబింబిస్తోందన్నారు. ఈ వేదిక సమాజంలోని విభిన్న వర్గాల మధ్య ఐక్యతను పెంపొందిస్తోందని తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుందని ఈటల పేర్కొన్నారు. ఈ జాతర ద్వారా బీసీలలో అవగాహన పెరగడమే కాకుండా, వారి హక్కుల కోసం పోరాట స్పూర్తి మరింత బలపడుతుందని చెప్పారు.బీసీ ఉద్యమం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, సామాజిక న్యాయం కోసం కొనసాగుతున్నదని ఆయన స్పష్టం చేశారు. ఐక్యతతో, నిరంతర కృషితో బీసీలు కోరుకుంటున్న రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.యువత, మేధావులు, సామాజిక కార్యకర్తలు కలిసి పనిచేస్తే ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.సభలో బీసీల హక్కులు, సామాజిక సమానత్వం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భవిష్యత్ రాజకీయాల్లో బీసీ ఐక్యత కీలక పాత్ర పోషిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

కాపు నేతలు రవిచంద్ర , విద్యాసాగర్ కు కృతజ్ఞతలు

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *