ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ తన తండ్రికి భావోద్వేగభరితంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించిన ఆయన, “స్ఫూర్తిదాయక నాయకుడైన ఆయన్ని ‘నాన్న’ అని పిలిచే అదృష్టం నాకు దక్కింది” అని పేర్కొన్నారు.ప్రజాసేవ పట్ల చంద్రబాబు అంకితభావం రోజురోజుకు మరింత బలపడుతోందని లోకేశ్ తెలిపారు. ఆయన అనుభవం, దూరదృష్టి, శక్తి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయని కొనియాడారు. ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇదిలా ఉండగా, చంద్రబాబు జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
