ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ ప్రాంతంలో ఓ చిన్నారి చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మైనస్ 15 డిగ్రీల తీవ్ర చలిలో, ఆక్సిజన్ కూడా తక్కువగా ఉండే ప్రమాదకర పరిస్థితుల్లో 10 ఏళ్ల వరేణ్య కూచిపూడి నృత్యంతో ప్రతిభ చాటుకుంది.నిర్మల్ పట్టణానికి చెందిన వరేణ్య, బారాముల్లా జిల్లా గుల్మార్గ్లోని ఆఫర్వాత్ పర్వతంపై నిలబడి “శ్రీ విఘ్నరాజం భజే” అంటూ నృత్యం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సముద్ర మట్టానికి సుమారు 3950 మీటర్ల ఎత్తులో, తీవ్ర చలిని తట్టుకుని ఆమె ప్రదర్శన ఇవ్వడం విశేషం.గత నాలుగేళ్లుగా గురువు వద్ద కూచిపూడి శిక్షణ పొందుతున్న వరేణ్య ఇప్పటికే పలు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకుంది. అయితే ఈసారి మంచు పర్వతంపై చేసిన నృత్యం ప్రత్యేకంగా నిలిచింది.ఈ సాహస ప్రదర్శనను చూసిన దేశ, విదేశీ పర్యాటకులు చిన్నారిని అభినందించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా కళాప్రతిభను చూపిన వరేణ్యకు సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి..

