హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’లో భాగంగా నగరవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక సోదాల్లో 567 కేసులు నమోదు చేశారు.ఈ దాడుల్లో సుమారు రూ.1.10 కోట్ల విలువైన గుట్కా, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా చార్మినార్ జోన్లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అధికారులు తెలిపారు. COTPA, BNS మరియు జువెనైల్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు.
