హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనం పాటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.తెలంగాణలో జరిగిన తాజా సభలో ఆయన ఈ కీలక అంశాలను ప్రస్తావించకపోవడం గమనార్హంగా మారింది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్న సమయంలో కేసీఆర్ స్పందించకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.అదేవిధంగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పనితీరుపై కూడా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తన ప్రసంగంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే దృష్టి సారించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సమస్యలు, అమలు కాని హామీలపై ప్రశ్నలు లేవనెత్తుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.ఈ నేపథ్యంలో కేసీఆర్ మౌనం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
