హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పరిస్థితులు ఉత్కంఠగా మారుతున్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ప్రాధాన్యంగా చూస్తోందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని, ఉద్యోగుల డిమాండ్లపై ఆర్థికశాఖ మంత్రితో కలిసి చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా సానుకూల చర్యలు తీసుకుంటామని చెప్పారు.అదే సమయంలో కొందరు ఆర్టీసీ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారని మంత్రి ఆరోపించారు. సంస్థ పురోగతిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా, తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రేపటి నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రవాణా సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
