అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియామక విధానాన్ని అమల్లోకి తీసుకువస్తూ “ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్, 2025”ను అమలు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.1975 నాటి పాత విధానాన్ని రద్దు చేసి, ప్రస్తుత పరిపాలనా అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త విధానాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఏర్పాటైన 26 జిల్లాల నిర్మాణానికి సరిపడేలా ఉద్యోగ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం అవసరమైందని అధికారులు పేర్కొన్నారు.కొత్త నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాల డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులకు కేటాయించనున్నారు. జిల్లా, జోనల్, మల్టీ-జోనల్ స్థాయిలలోని పోస్టులన్నింటికీ ఈ విధానం వర్తించనుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.“స్థానిక అభ్యర్థి” నిర్వచనంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అభ్యర్థి కనీసం నాలుగు సంవత్సరాలు సంబంధిత ప్రాంతంలోని విద్యాసంస్థల్లో చదివి ఉండాలి. అర్హత పరీక్షకు ముందు ఉన్న విద్యా కాలాన్ని ఆధారంగా తీసుకుని ఈ ప్రమాణాన్ని అమలు చేయనున్నారు.కొత్త విధానంలో ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టీ-జోనల్ కేడర్లుగా విభజించి నియామకాలు చేపడతారు. దీనివల్ల పరిపాలనలో పారదర్శకత పెరిగి, ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కొందరు అభిప్రాయపడుతుండగా, ఇతర ప్రాంతాల అభ్యర్థులకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
