ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): నాగర్కర్నూల్ జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే వింత ఘటన చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో ఓ పంది ఏనుగు ఆకారాన్ని పోలి ఉన్న పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య పందులను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని వద్ద ఉన్న ఒక పంది మొదటి ఈతలో మొత్తం ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వాటిలో ఒక పంది పిల్ల అచ్చం ఏనుగు పిల్లలా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తొండం ఆకారం, పెద్ద చెవులతో ఆ పంది పిల్ల ఏనుగును పోలి ఉండటం విశేషంగా నిలిచింది.ఈ విషయం గ్రామంలో తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ వింత పంది పిల్లను చూసేందుకు ఆసక్తి చూపారు. అయితే జననం తర్వాత కొద్దిసేపటికే ఆ ఏనుగు ఆకారపు పంది పిల్లతో పాటు మరో పంది పిల్ల కూడా మృతి చెందాయి. ప్రస్తుతం మిగిలిన ఐదు పంది పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు యజమాని తెలిపారు.
